నా జీవితంలో దైవ లీలలు:
నాకు జీవితంలో ఎప్పుడూ అహా ఇది భగవంతుని లీల అని అనిపించే అద్భుతాలు ఏమీ జరగలేదు. నేను పెద్ద పూజలు పున:స్కారాలు చేసే మనిషిని కాదు. నేను ఇప్పటికీ గుడికి వెళ్లిన నాకి ఇది కావాలి అని కోరుకోను. మా నాన్న గారు చాలా కాలం నాస్థికుడు. ఆయన జంధ్యం కూడా వేస్కునే వారు కాదు. మా అమ్మ మాత్రం సనాతన ధర్మాలని కాపాడుకుంటూ, మడికట్టుకోవటం, పూజా పున:స్కారాలు చెయ్యటం, ప్రతీ రోజూ మహానైవేద్యాలు పెట్టటం అవీ చేస్తుండేది. తర్వాత తర్వాత నేనూ నెమ్మదిగా నమ:స్కారం పెట్టుకోవటం ప్రారంభించా. 1996 లో మా నాన్న ఆలోచనా విధానంలో కొంచెం మార్పు రావటం మొదలైంది, అదేనాలోనూ మార్పుకి శ్రీకారం చుట్టింది. 1996 లో మా నాన్న వైతీశ్వరన్ కోయిల్ కి వెళ్లొచ్చారు, ఆ గుడిని చూడాగానే మా నాన్న కి ఎదో అలజడి కలిగి వెంటనే జంధ్యం ధరించి స్నానం గట్రా చేసి వెళ్లి వైతీశ్వరన్ దర్శనం చేస్కున్నారు. అప్పటినుంది కొన్ని కారణాల వల్ల కొన్ని సంఘటనల వల్లా మా నాన్నకీ నాకూ అలవాటైయింది దేవుడు భక్తి. ఆయన నెమ్మదిగా షిర్డీ సాయిబాబా వైపుకి మళ్లారు. చాలా సార్లు షిర్డీ కి కూడా వెళ్లొచ్చారు.
1999 లో మా నాన్నకి గుండె పెరిగి ఆశ్పత్రికి వెళ్లాం. డాక్టరు చూసి, మీ బంధువులందర్నీ పిల్చుకోండి అని కూడా చెప్పారు. మా నాన్న షిర్డీ సాయి నమ్ముకున్నారు, మా అమ్మ కనపడిన దేవుళ్లకీ మొక్కుకుంది. నేనేమి అనుకోలేదు. మానాన్న క్షేమంగా తిరిగి ఇంటికి వస్తే శ్రీశైలం వస్తా అనుకున్నా. పదిరోజుల్లో మా నాన్న తేరుకుని ఇంటికి వచ్చేసారు. నేను ఆరాత్రికి రాత్రే శ్రీశైలం వేళ్లి తలనీలాలు ఇచ్చేసి, శ్రీశైలనాధుని గర్భ గుడిలో ఆ యన పక్కనే కూర్చుని అభిషేకం చేస్కుని వచ్చా. నా మొట్టమొదటిసారి శ్రీశైల ప్రయాణం, ఆ శివలింగం పక్కనే కూర్చొని మొట్టమొదటి సారి తాకినప్పటి ఆ అనుభూతి, తృప్తి, ఆనందం, రోమాంఛం. మళ్లీ నాకె ఎన్ని సార్లు శ్రీశైలం వెళ్లినా కలగలా, మరెక్కడికి వెళ్లినా కలగలా.
తర్వాత్తర్వాత 2005 లో మా నాన్నగారు మమ్మల్నందర్నీ ఆశ్చర్యంగా శోకంలోకి నెట్టేసి ఆ శివంలోకి కలిసిపొయ్యారు.
నాకు అంతా శూన్యం అయిపోయింది. అప్పుడూ, మొట్టమొదట మానాన్నకి ఎంతో ఇష్టమైన పొందుగుల లో మా నాన్న అస్తికలు నిమజ్జనం చేసాం. కొందరు ప్రయాగలో చెయ్యండీ అని కొందరు కాశీలో చెయ్యండీ అని సలహాలు ఇచ్చారు. నేనాలోచించి, ప్రయాగ త్రివేణీ సంగమంలోనూ, కాశీలోనూ కలుపుతా అని బయలుదేరా. నాకు ట్రైన్లో ఒకతను పరిచెయం అయ్యారు. చక్కటి భాష, స్థిరమైన దృష్టి. పరిచయం అయ్యింది. అతనిది చీరాలే. ప్రయాగ లో ఇద్దరం కలిసే లాడ్జీ తీస్కున్నాం. అక్కడి అస్సిస్టెంటు కమీషనర్ ఆఫ్ పోలీస్, ఆయన క్లాస్మేటే అట, ఫోన్ చేస్తే వెంటనే ఒక యస్.ఐ వచ్చాడు. మమ్మల్ని త్రివేణీ సంగమం దెగ్గరకి సునాయాసంగా తీకెళ్లి అక్కడి మోసగాళ్ల చేతిలో పడకుండ అన్నీ కార్యక్రమాలు దెగ్గరఊంది చేయించి పంపించాడు. వెంటానే కాశి వెళ్లాం ఇద్దరం. అక్కడకూడా కలిసే గది తీస్కున్నాం. అతను కార్యక్రమాలు చేకుని నిష్క్రమించారు. ఆయన అవాయా అనే కమ్మ్యూనికేషన్స్ కంపెనీకి వైస్ప్రెసిడేంటు. నేను మూడు రాత్రులు ఉందాం అని నిర్ణయించుకుని ఉండి, ఆ శంభూనాధుని దర్శనం చేస్కుని, కాశీలోని అన్నీ గుళ్లూ గోపురాలూ చూస్కొని, సంకట హనుమాన్ని కొల్చుకుని, రుద్రుడ్ని కూడా దర్శించుకుని బయల్దేరా. కానీ నాకు అంత తృప్తి అనిపించలా. శ్రీశైలం అంత ప్రశాంతంగా ఏదీలేదు అనిపించింది.
మా నాన్న నిష్కమణాశూన్యం నుండి నెమ్మదిగా నిలదొక్కుకుని, మళ్లీ నన్ను నేను జీవనశ్రవంతిలోకి తెచ్చుకుని, పొట్టచేతబట్టుకుని అమెరికాకి వచ్చి ఇక్కడ ఉద్యోగం సంపాదించి, ఇదిగో ఇలా ఉన్నా. ఈ ప్రయాణంలో మా నాన్న నావెనక ఉండి నన్ను నడిపిస్తున్నాడనే భావన. మా అమ్మ కొడుకు వృధ్ధిలోకి రావాలీ అనే సంకల్పం. నాభార్య,మా ఆయన జీవితపు ఉఛ్ఛస్థితికి వెళ్లాలి అనే సంకల్పం అన్నీ మిళితమై ఉన్నాయి.
మా పాప పుట్టుక మాత్రం నాకు కొంచెం దైవలీలేనా అనిపించింది. దేనికంటే
అక్టోబరు 6 ప్రసవం కావొచ్చని డాక్టర్లు ఇచ్చిన తారీఖు. సెప్టెంబరులో మన సహ బ్లాగరు, మాష్టారు దుర్గేశ్వర గారు ఓ రోజున ఛాట్లో కలిసి, మీరు ఇరవైఒక్క రోజులు రుద్రం చెయ్యండీ మంచిదీ అని చెప్పారు. విఘ్నం కలుగకుండా చేయ్యండీ అన్నారు. మరి ఇలా అక్టోబరు 6 న డెలివరీ కదా అన్నా. అప్పటికి ఇరవైఒక్క రోజులు కావు మాష్టారూ అన్నా. పర్లేదు, ఆ సమయం వచ్చినప్పుడు నాకు చెప్పండీ మీపేరు మీద నేను చేస్తా అన్నారు ఆయన. మొదలు పెట్టాను చెయ్యటం. ఈ లోపల సెప్టెంబరు 29, శరన్నవరాత్రులు మొదలయ్యాయి. నిండు నెలలతో సాయంత్రం 6 కల్లా వంటా వార్పూ సిద్ధం చేస్కుని, ప్రసాదం తయ్యారు చేస్కొని, పిల్లాడికి స్నానం గట్రా చేయించి, వాడికి ఏదోకటి తింటానికి మూట కట్టుకుని గుడికెళ్లే వాళ్లం. నవరాత్రులు మొత్తం ప్రతీరోజూ అమ్మవారి అలంకారం, మరియూ శ్రీ లలితా సహస్రనామ పారాయణార్చన జరుగుతాయ్ అని ముందే ప్రకటించారు గుడివాళ్లు.
ప్రతీ రోజు వెళ్లాం. తను కష్టపడి కూర్చొని మొత్తం పారాయణ చేసి, తీర్ధ ప్రసాదాలు తీస్కుని అప్పుడు ఇంటికి వచ్చేవాళ్లం. ప్రతీరోజు జనాలు అడిగేవారు ఇంకా కాలేదా అని. తలా ఒకలా చెప్పేవారు ఇక ఈరోజు అవుతుందిలే, 3 న అవుతుంది అని నాకనిపిస్తుంది అని ఒకావిడ అంటె, 5 న అవుతుంది అని ఇంకొకళ్లు ఇలా. మొత్తానికి, లెక్క ప్రకారం నా రుద్ర పారాయణ అక్టోబరు 8 కి అయిపోయింది. లెక్క ప్రకారం దేవీ నవరాత్రులు తిథుల ప్రకారంకాకుండా రోజుల ప్రకారం, సెప్టెంబరు 29 నుండి తొమ్మిదిరోజులు కలిపితే అక్టోబరు 8 కి అయిపొయ్యాయి. అక్తోబరు 8 న కూడా గుడికి వెళ్లాము. అందరూ ఆశ్చర్య పోవటం ఇంకా కాలేదా అని. మొత్తానికి అక్టోబరు తొమ్మిదిన, అంటే విజయ దశమినాడు, శ్రవణా నక్షత్రం రోజున పాప పుట్టి మమ్మల్నందర్నీ ఆనందంలో ముంచేసింది.
ఇది ఆ అమ్మవారి లీలేనా? ఏమో అలా రాసిపెట్టి ఉందేమో....
శుభం
{పంపినవారు.....రామరాజు భాస్కర్..అమెరికానుండి}
Thanks and Regards
Bhaskar Ramaraju
http://www.linkedin.com/in/ramarajubhaskar
http://javagongura.blogspot.com
http://ramakantharao.blogspot.com
http://projectsforfuture.blogspot.com/
http://nalabhima.blogspot.com/
http://verbosegc.blogspot.com
http://ramaraju.org
http://it.toolbox.com/people/bhaskar_ramaraju/
[ ఒంటరిగా నున్నానని ఎలా ఈపరిస్తితినుంచి గట్టేక్కాలా అని ఆందోళన చెందుతున్న సమయములో తానే తోడునీడై పరమేశ్వరుడు కాపాడుతూ భాస్కర్ గారికి విజయదశమినాడు అమ్మవారి ప్రసాదంగా ప్రభవించిన పాపపేరు అనఘ.దత్తాత్రేయస్వామి సహచారిణి]
Saturday, January 24, 2009
Labels: మహాదేవ శంభో .......
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
ధన్యవాదాలు మాష్టారు
Post a Comment