రామ ప్రతిష్ఠ - వరద ముంపు
నాగాయలంక లాంచీరేవు గట్టున సంతరోజు చేపల తట్టలు, గడ్డి మూటలు పెట్టుకుని అమ్ముకునేవారు. అక్కడి నుండి లాంచీలమీద సుమారు వేయి మంది పెనుమూడి మీదుగా గుంటూరు జిల్లాకు పోతారు. దాదాపు వేయి మంది అక్కడికి వస్తారు.
అలాంటి తావులో భగవంతుడు జ్ఞాపకం వస్తే బాగుంటుందని తోచి, స్వహస్త పరహస్తాలతో శ్రీ కోదండరామాలయం, రమాసహిత సత్యనారాయణ ఆలయం రెండూ నిర్మించడం జరిగింది. జయిపూర్ నుండి చలువరాతి విగ్రహాలు తెప్పించాము. 1964 మే నెల 31 తేదీ నాటికి ప్రతిష్ఠకు ముహూర్తం నిశ్చయించాము. అందుకు సమస్తమైన ఏర్పాట్లు జరిగాయి.
ఇంతలో, కంచి పెద్దస్వాములు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి షష్టిపూర్తి మే నెల 25వ తేదీన కంచికి మూడుమైళ్ళ దూరంలో అంబి గ్రామంలో జరుగుతుందని తెలిసింది. నేను మా శిష్యుడు తుంగల నాగభూషణం ఇద్దరం బయలుదేరిపోతూ, 31వ తేదీ ప్రతిష్ఠ నాటికి తప్పకుండా వస్తామని, ప్రతిష్ఠకు పూర్వం జరగవలసిన అధివాసాదులు చేసి సిద్ధంగా ఉండండని చెప్పి, మేము అంబికి బయలుదేరాము. అప్పుడు అక్కడికి శ్రీ మండలీక వెంకటశాస్త్రి, శ్రీ కుప్పా లక్ష్మావధానులు, శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి గార్లు కూడా వచ్చారు.
షష్టిపూర్తి రోజున మాకెవరికీ స్వామి వారి తీర్థం దొరకలేదు. ఆ మర్నాడు 26వ తేదీ తీర్థం పుచ్చుకుందా మనుకున్నాము. ఆనాడే నేను స్వామి దర్శనం చేసింది. అంతకు పూర్వం నేనెన్నడూ చూడలేదు. నేను తీర్థానికి చెయ్యి చాచాను. స్వామి నాకు తీర్థమిచ్చి, చేతిలో ఉన్న పెద్ద ఉద్ధరిణె కింద పెట్టి, “ప్రతిష్ఠ ఎప్పుడు?” అని అడిగారు. నేను నిర్ఘాంతపోయాను. “మా ఇంట్లో మందిరంలో ఎప్పుడో అయింది” అన్నాను. “అది కాది. నది ఒడ్డున ఏర్పాటుచేశావే, ‘రామ పాద క్షేత్రం’ అక్కడి ప్రతిష్ఠ” అన్నారు.
“దానిని మే 31వ తేదీన చేద్దామని అనుకున్నాము” అన్నాన్నేను.
స్వామి వారు వెంటనే “31వ తేదీన చేస్తారా?” అని అన్నారు
స్వామి ప్రశ్నార్థకంగా అన్న మాటలో ఆ రోజున ప్రతిష్ఠ జరగదనే ధ్వని వినిపించింది.
స్వామి మాకు అక్షింతలు, కుంకుమ, కిస్మిస్ పండు ప్రసాదంగా ఇచ్చి, యంత్రానికి ప్రత్యామ్నాయంగా వాటిని విగ్రహాల కింద ఉంచందని సెలవిచ్చారు.
ఇంతలో 28-5-1964న ప్రధానమంత్రి నెహ్రూ గారు పరమపదించారు. అందుచేత ఆనాడు రైళ్ళు, బస్సులు నడవలేదు. 29వ తేదీ బయలుదేరి 30వ తేదీ సాయంత్రానికి మేము ఊరు చేరుకున్నాము. మేము ఊరిలో లేనందున ‘గురువుగారు లేని ప్రతిష్ఠా’ అంటూ గ్రామస్తులు ఏ పనీ మొదలుపెట్టలేదు. అందుచేత మళ్ళా జూన్ 11వ తేదీన ప్రతిష్ఠకు ముహూర్తం పెట్టి ఆపని నిర్వహించాము. స్వామివారన్నది నిజమైంది.
మరొక విచిత్రమేమంటే, స్వామివారాస్థలాన్ని ‘రామపాదక్షేత్ర’మని ఎందుకన్నారు? తరువాత రెండు నెలలకు నాగార్జునడాము విరిగి కృష్ణానదికి అంతులేని వరద వచ్చింది. అప్పుడు ఆ వరద నీరు గుడిలో శ్రీరామపాదాల నంటి తగ్గిపోయింది. ఆ వరద ఇంకో అంగుళం పెరిగినట్టయితే దివితాలూకాలో 70 గ్రామాలు వరదకు కొట్టుకుపోయేవి.
వారికి భూత భవిష్యత్ వర్తమానములు అన్నీ తెలుసు. వారు కాలమునకు లొంగని కాలాతీతులు.
--- శ్రీరామ శరణ్ కుందుర్తి వెంకట నరసయ్య

1 comments:

Unknown said...

వెంకన్న సేవ కి Whatsapp

https://www.youtube.com/watch?v=X9cAkbSfr0k&feature=youtu.be