జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
ఇరవైనాలుగుకోట్ల రామనామ జపలక్ష్యంగా ఈ సంవత్సరం జరిగిన హనుమద్రక్షాయాగం ఆరవ ఆవృత్తి మరో మూడు రోజుల్లో పూర్తి కానుంది. శుక్రవారం హనుమజ్జయంతి సంధర్భంగా స్వామికి అభిషేకాదులు, 24న పూర్ణాహుతి నిర్వహించడం జరుగుతోంది .ఈ సంవత్సరం రోజుల్లో ఆ స్వామి ఎప్పటిలాగే చాలా లీలలు కనబరిచారు. అందులో ఒకటి,
నేను ఇంతకుముందు పని చేసిన సంస్థలో నా సహోద్యోగికి ఒక సమస్య వచ్చింది. సంవత్సరం క్రితం  తనకు ఒక పెళ్ళి సంబంధం వచ్చింది. సరే చూద్దాం అనుకునే లోపు వారి వైపు పెద్దవాళ్ళు ఒకరు చనిపోయారు. దాంతో సంవత్సరం వరకు వాయిదా వెయ్యాల్సి వస్తుంది అన్నారు. పెళ్ళి కొడుకు తరపు వాళ్ళు మాకేమీ అభ్యంతరం లేదు అన్నారు. ఇక పెళ్ళి మాటలు ఏమీ మాట్లాడుకోలేదు ఎవరూ. వారింటికి వీరు వెళ్ళడం, వీరింటికి వారు వెళ్ళడం మా కోడలని, మా అల్లుడని  పరిచయం చేసుకోవడం అన్నీ జరుగుతున్నాయి. సంవత్సరం అయ్యాక పెళ్ళి మాటలు అనుకునేటప్పుడు ఇరువైపుల వారిది ఒకే కులం కాదని తెలిసింది. దాంతో పెళ్ళికూతురి తండ్రి ఈ సంబంధం వద్దు అన్నారు. వీళ్ళిద్దరేమో సంవత్సరం నుండి భార్యాభర్తలమవుతామనుకుని అనుకున్నాము. ఇప్పుడు వద్దంటే ఎలా? అని. ఆ అమ్మాయి పాపం చాలా బాధ పడుతూ ఉండేది. నన్నొకసారి అడిగింది. ఏం చెయ్యాలి అని.
"చూడండి నాకు తెలిసింది ఒకటే, ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుడిని అడగడమే, లేదంటే ఇదే నాకు మంచి అని భగవంతుడు నిర్ణయించాడు అనుకుంటాను. మీరు పలానాది నాకు మంచి అని అనుకుంటున్నారు కాబట్టి మీ సింహాసనం లో ఉన్న కుల దైవాన్ని అడగండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతారు? స్వామీ నాకు దారి చూపించు అని నిలదియ్యండి" అన్నాను. ఆ అమ్మాయి కొంచెం విస్మయంగా చూసింది. "అవునండీ తప్పులేదు, మీరు రోజు దీపం పెట్టి దణ్ణం పెట్టుకునే భగవంతుడిని అడగకపోతే ఇంకెవరిని అడుగుతారు. నాకు తెలిసినంత వరకైతే ఆ స్వామి భార్యాభర్తల విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఆయనే దాంపత్యానికి రక్ష, అందుకే ఎవరి ఫొటో ఉన్నా లేకున్నా పెళ్ళిళ్ళలో ఇప్పటికీ సీతారాములుంటారు. వాళ్ళద్వారా ఆశీస్సులిస్తూ హనుమ ఉంటారు. మీరు చేస్తానంటే నాదగ్గర ఓ మార్గం ఉంది అన్నాను. " చెప్పండి అన్నది ఒకింత ఆశగా. "నేను మీకు హనుమాన్ చాలీసా ఇస్తాను. నిజమైన తాటియాకులమీద రాసిన హనుమాన్ చాలీసా ఇంతకుముందు ప్రసాదంగా హనుమద్రక్షాయాగంలో మాస్టరుగారు ఇచ్చారు. నాకెందుకు మాస్టరుగారు నేను చాలీసా చూసి చదవను కదా అంటే ఆయన ఉంచు ఎవరికైనా నిజంగా అవసరం అనిపించినప్పుడు ఇవ్వు అన్నారు. నాకెందుకో అది మీకు అవసరం అని అనిపిస్తుంది. అది ఇస్తాను . ఒక నలభై రోజులు రోజుకి పదకొండుసార్లు పారాయణ చెయ్యండి.  నలభైరోజులు పూర్తి కాకుండానే మీ పెళ్ళి పత్రిక తీసుకువస్తారు స్వామి అనుగ్రహం ఉంటే అన్నాను. నిజంగానా అన్నది. పుస్తకాల్లో చదివి నేను చెప్పడంలేదు, నా స్నేహితుడొకరికి నిజంగా జరిగింది కాబట్టి చెప్తున్నాను అన్నాను. చేస్తానండి అని చెప్పి తీసుకొన్నది. తరువాత నలభై రోజులయ్యాక ఫోను చేసాను ఏమైందండి అని, ఏమీ కాలేదండి అన్నది. మీరు హనుమాన్ చాలీసా నిజంగా చేసారా నేను చెప్పినట్టు అన్నాను. కుదిరినప్పుడల్లా చేసానండి,ఒక్కోసారి ఆఫీస్ వల్ల కుదరలేదు అన్నది.

అలాకాదండి, సీరియస్ గా నలభై రోజులు నేను చెప్పినట్టు చెయ్యండి. జరగకపోతే అప్పుడడగండి అన్నాను. సరే అని ఆ రోజునుండి చాలీసా క్రమం తప్పకుండా పారాయణ చెయ్యడం మొదలుపెట్టింది. కొన్ని రోజులయ్యాక మనోహర్ గారు ఒక గుడ్ న్యూస్ అన్నది, ఏమంటే కనీసం రెండువైపుల వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలని అనుకున్నారు అని చెప్పింది. మరికొన్ని రోజుల తర్వాత తరువాత పెళ్ళికి ఒప్పుకున్నారు ఉత్తరభారతంలో ఉండే మా పెదనాయన గారు ఒకాయన వచ్చి పిల్లగురించి కూడా అలోచించండి అని సర్దిచెప్పి ఒప్పించారు అని అన్నది. ఇదంతా మీనోటి చలవే మనోహర్ గారు, నాకోసమే ఆ చాలీసా మీదగ్గరకొచ్చిందేమో అని అన్నది. అలా ఏం లేదండీ, మీ కష్టం తీరే మార్గం ఉంది అని స్వామి నాతో చెప్పించారు. నేను కాకపోతే మరొకరు చెప్పేవారు, ఆ స్వామి అనుగ్రహం మీ మీద ఉంది ఒకసారి ఆయన పాదాలు పట్టి చూసారు కదా, ఇక విడవకండి. ఇంతకీ పెళ్ళెప్పుడు అన్నాను. ఇంకా ముహుర్తాలు అనుకోలేదు శ్రీరామనవమి అయిన తర్వాతి రోజు పెట్టుకుంటారు అన్నది. ఇంకేం సంపూర్ణ శ్రీరామపరివార అనుగ్రహం మీమీద ఉంది. ఇక భయపడకండి అన్నాను. ఇంకా మీపారాయణ ఎన్ని రోజులుంది అని అడిగాను. ఐపోవచ్చింది ఇంకొన్ని రోజుల్లో అయిపోతుంది అన్నది. నేను చెప్పాను కదా మీ పారాయణ పూర్తయ్యేలోపు మీ సమస్య పరిష్కారం అవుతుంది అని అన్నాను. పారాయణ పూర్తయ్యేలోపు పెళ్ళికి ముహూర్తం నిర్ణయించారు జూన్ 19 అని చెప్పింది. ఆరేడు నెలల నుండి ఆమె గొంతులో అంత సంతోషం ఎప్పుడూ వినలేదు, మనసులోనే స్వామికి సాష్టాంగ ప్రణామం చేసుకున్నాను.
అలాంటి అసాధ్యసాధక స్వామికి రేపు అభిషేకాలు, అవబృధ స్నానాలు జరుగుతాయి.  ఈ సారి నాకు మరింత ప్రత్యేకం, పెళ్ళైనతర్వాత మొదటిసారి అందరం వెళ్తున్నాం.ఆ స్వామి అనుజ్ఞ గానే పెళ్ళి చేసుకున్న నా భార్యని, ఆ స్వామి గండంనుండి బయటపడేసి బతికించిన బిడ్డని ఆయనకి చూపించడానికి తీసుకువెల్తున్నా. అన్నిటికంటే మరింత ప్రత్యేకం మా నాన్నగారు కూడా ఈసారి యాగానికి వస్తున్నారు. చాలా ఆత్రంగా ఉంది. ఈ రెండురోజులు గడిచిపోతే శుక్రవారం తెల్లారేటప్పటికి ఆ స్వామి ముందు ఉంటాను.

అవబృధ స్నానానికి భక్తుల తరపున 108 కలశాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఏవరైనా రావాలనుకున్నా, తమ పేరు మీద కలశం ఏర్పాటు చెయ్యాలనుకున్న, యాగానికి ఏదైనా సహాయం చెయ్యాలనుకున్నా నన్ను కానీ మాస్టరుగారిని కానీ సంప్రదించగలరు.         
వివరాలు
durgeswara.blogspot.in(9948235641)durgeswara@gmail.com
మనోహర్-9742702802
విధేయుడు
మనోహర్ చెనికల

0 comments: