సుమారు నెలరోజుల క్రితం అనుకుంటా, గ్రూప్ లో భాగవతం ఎక్కడ దొరుకుతుంది
అంటూ అడగడం జరిగింది. సహృదయతతో చాలామంది స్పందించారు. టి.టి.డి ఆఫీస్ లో
దొరుకుతుంది అంటూ సమాచారం అందించారు. దేవుడి దయ వలన కార్తీక మాసం
మొట్టమొదటి రోజున (పాడ్యమి) ఆ భగవంతుడు, సకల వేదార్ధ స్వరూపమైన
భాగవతాన్ని నాకు అందించారు. ఈ పుస్తకం నా చేతికి రావడానికి ఈ గ్రూప్ ఒక
ముఖ్య కారణం. అందుకే మీతో ఒక విషయం పంచుకుందామని ఇది రాస్తున్నాను.మొన్న
ఆదివారం వెల్దామా వద్దా అనుకుంటూ సడెన్ గా అప్పటికప్పుడు అనుకుని
లింగంపల్లి నుండి హిమాయత్ నగర్ టి.టి.డి ఆఫీస్ కి వెల్లాను. అక్కడకి
వెళ్ళేదాక సందేహం. దొరుకుతుందో లేదో, పూణే నుండి ఇంత దూరం వచ్చాను, తీరా
దొరక్కపోతే నిరాశతో వెనక్కి వెళ్ళాల్సి వస్తుందేమో అనుకుంటూ లోపలికి
వెళ్ళాను.అక్కడ చూస్తే కట్టలు కట్టలు భాగవతం సెట్లు ఉన్నాయి. నా మనస్సు
ఆనందం తో గంతులు వేసింది.అడిగాను , ఆయన అన్నాడు కదా, "బాబూ ఈ రోజు
అమావాస్య కదా రేపు వచ్చి తీసుకోండి, కేవలం ఈ పుస్తకం కోసం పూణే నుండి
వచ్చానంటున్నారు కదా, పోయి పోయి అమావాస్య రోజు ఎందుకు, ఇంతకు ముందే
ఇద్దరు వచ్చి తీసుకుందామనుకుని మళ్ళీ అమావాస్య అని గుర్తు తెచ్చుకుని
రేపు వస్తామని వెళ్ళిపోయారు, తర్వాత మీ ఇష్టం" అన్నారు. నాకు అది ఆ
భగవంతుడి సలహా లా అనిపించింది.చిన్నప్టినుండి షాడో పుస్తకాలూ, యండమూరి
పుస్తకాలూ చదివీ, చదివీ ఇప్పుడు నా గురించి చదవడం మొదలుపెడుతున్నాడు,
అలాంటిది అమావాస్య రోజు ఎందుకు,పవిత్ర కార్తీక మాసంలో ఆ పుస్తకాన్ని నాకు
అందిద్దాం అని ఆ రామ చంద్ర మూర్తీ ,రామదూత అనుకున్నారేమో అనిపించింది.

ఇంతకీ ఆ వచ్చిన వాళ్ళు ఇద్దరూ ఎవ్వరు?
ఆ రామభద్రుడు, రామదూతేనా , లేక నా అజ్ఞానమా ? ఏమో, ఆయనకే తెలియాలి.

కానీ ఒక విషయం చెప్పాలి. నిజంగా మనం ప్రయత్నించాలి అనుకుంటే ఆ భగవంతుడే
దారి చూపిస్తాడని మాత్రం అర్ధం అయ్యింది....


మనోహర్ చెనికల

భగవంతుని నమ్మిఆశ్రయించాలా వద్ద అనేసందిగ్దం లో కొట్టుమిట్టాడుతున్న ఓ ప్రముఖ బ్లాగర్ తన జీవితాన జరుగుతున్న ఆదైవలీలలను చూసి తబ్బిబ్బయిపోతున్నాడు .తనపేరు చెప్పవద్దని ,అదితనకు అహంకారాన్ని పెంచుతుందేమోనన్న వినయంతో ఆయన పేరు చెప్పవద్దనగా ఆయనపేరు వెల్లడించటం లేదు. ఇక ఆయన మాటలలోనే చదవండి ఆకొండలరాయుని లీల

------------------------------------------------------------------------------------------------

విరోధి నామ సంవత్సర, ఆశ్వీయుజ మాసం బహుళ సప్తమి తిథి.
(10 Oct, 2009)

ప్రతి యేడు తిరుపతికి వెళ్ళడం మా ఇంట ఆచారం, నాకు మానసికంగా ఉత్తేజం చేకూర్చే ఓ అలవాటు. కొన్నేళ్ళుగా వెళ్ళలేదు. అయితే ఎందుకో సంకల్పం కలిగింది. అదీ ఒక వారం ముందు మాత్రమే. శుక్రవారం రోజు ఉన్నపళాన బెంగళూరునుండి, తిరుపతి బస్సెక్కాను, రాత్రి. బయల్డెరే ముందు ఓ విషయం అనుకున్నాను. దర్శనం లేట్ అవుతుంది అన్నట్లయితే, వాపస్ వచ్చేసి, తిరిగి మళ్ళెప్పుడయినా చూడాలి అని.

సరే, శనివారం పొద్దున తిరుపతి బస్ స్టాండ్ వద్ద సుదర్శనం క్యూలో నించున్నాను. ఓ మూడు గంటల తర్వాత ఉదయం 9 కు దర్శనం టికెట్ దొరికింది. 9 లోపల స్నానాదులవీ ముగించి, క్యూలో నిలబడితే, 9:45 కంతా దర్శనం అయిపోయింది. ఇది ఒక వింత. ఇదివరకు నేను ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా ఇంత తక్కువ సమయంలో నేను తిరిగి వచ్చింది లేదు.

తిరుపతికి వెళ్ళడానికి ప్రేరణ - అనుకోని సమస్యలలో చిక్కుకొని, ఎవరూ పరిష్కారం చూపలేక, చివరకు "అన్యథా శరణం నాస్తి" అని స్వామిని వేడుకోవడం కోసమే.

నేను జన్మ రీత్యా బ్రాహ్మణుణ్ణి. చిన్న వయసులోనే
మా నాన్న గారు ఉపాకర్మ జరిపి, మా తాతగారి సహాయంతో, సంధ్యావందనాదులు, నిత్యకర్మ మొదలైనవి ఆచరించేట్టు చూశారు. కొన్ని యేళ్ళ క్రితం మా
అమ్మ స్వర్గస్తులయారు. అప్పుడు కొన్ని సంఘటనల వలన నేను నాస్తికుణ్ణి (నాస్తికత్వం అన్నది చింతన మాత్రమే, ఆస్తిక ద్వేషం కాదు) కావడం జరిగింది. సంధ్యావందనాదులు
పక్కన పెట్టాను. పూజలు, అవీ అసలు లేవు.

ఆ తర్వాత గతవారం నుండీ మళ్ళీ నిత్యకర్మలు చేస్తున్నాను. తిరుపతి నుండీ వచ్చిన తర్వాత రోజు ఉదయం 5:30 కు నాకు, ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోను ఎత్తగనే, "వెంకటేశా" అని పిలిచారెవరో.
(రాంగ్ నంబర్ అది). అలా ఆ రోజూ ఉదయమే లేచి నిత్యకర్మ ఆచరించాను. (ఆ కాల్ రాకపోయి ఉంటే చాలా నిదానంగా లేచేవాణ్ణి). ఆ తర్వాత కొన్ని సమస్యలు నేను కల్పించుకోక
ముందే పరిష్కారమయాయి, విచిత్రంగా. ఇంకా ఏమి జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

(పొద్దున 5:30 కు ఎవరో రాంగ్ నంబర్ కాల్ చేసి, నిద్రలేపడం అన్నది దైవలీల మాత్రమే. సరే కాకతాళీయం అనుకుందాం. నేను నిద్ర లేచినా, కాసేపలా బద్ధకంగా ఉన్నాను. కాసేపటి తర్వాత మళ్ళీ ఇంకొక కాల్ (అదే నంబర్ అనుకుంటాను). ఈ సారి ఓ పెద్దావిడ. సౌమ్యంగానే ఏదో అడిగింది. ఆమే ఏమన్నదో నాకు గుర్తు లేదు. అప్పటికి నాకు పూర్తిగా మెలకువ వచ్చింది)

ఇంకో విచిత్రం. మా ఆవిడ ఉద్యోగం గత ఐదు యేళ్ళుగా డోలాయమానంగా ఉంది. అంటే, ఉద్యోగానికి ప్రమాదమంటూ ఏదీ లేదు కానీ, పర్మనెంట్ అవడానికి ఏవేవో ఆటంకాలు. తిరుపతి నుండి వచ్చిన రెండవ రోజు, ప్రభుత్వపు జీవో వచ్చింది. ఆమె ఉద్యోగం పర్మనెంట్ కానున్నట్టు. అయితే - మరో చిక్కు వచ్చింది. ఆమె సర్టిఫికెట్లు సొసయిటీ వారికి దాఖలు చేసినవి, ఎక్కడో మిస్ అయాయి అని వారి సొసయిటీ నుండీ ఉత్తరం వచ్చింది. ఆమె ఖంగారు పడింది. నేను సౌమ్యంగా ఉండమని, స్వయంగా కడపకు వెళ్ళి, సొసయిటీ అధికారులను మాట్లాడమని చెప్పాను. మరుసటి రోజామె కడపకు బయలుదేరింది. (కడపకు వెళ్ళాలంటే, కదిరిమీదుగా వెళ్ళాలి కదా అనుకున్నాను మనసులో నేను. కదిరిలో యోగలక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు). సాయంత్రానికి ఆమె పని చక్కబడింది. . అయితేనేం, పని అనుకున్న దానికన్నా సులువుగా జరిగింది.ఇది స్వామి దయమాత్రమే అని నాకు అనిపిస్తున్నది.
ఇంకా విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. నిన్న పాత మితృడు, నా రూమ్మేటు, పది యేళ్ల తర్వాత కలిశాడు, తనంతట తనే నన్ను వెదుక్కుంటూ వచ్చి. తన పేరు - "శేషాద్రి". ఆ మితృడితో, ఏమి చేయిస్తాడో, ఏమి చేయించుకుంటాడో ఆ స్వామి, ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

అబ్బాయి పెళ్ళిసంబంధం నిశ్చితార్థ ముహూర్తం కోసం ఆ దంపతులు మా దగ్గఱికొచ్చారు. మాటల సందర్భంలో "అభిజిన్ముహూర్తం సర్వశ్రేష్ఠమైనది. శ్రీరామచంద్రులవారి పెళ్ళి అందులోనే జఱిగింది" అని చెప్పాము. "రాముడూ, సీతా ideal couple కాదు గదా ! వాళ్ళ ముహూర్తం మనకెందుకు ?" అన్నాడా అబ్బాయి. అనడం ఇంగ్లీషులోనే అన్నా అవి రాములవారి చెవిలో పడనేపడ్డాయి. సరే, మొత్తం ముహూర్తం పెట్టడం అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు.

మర్నాడే ఆ ముసలిదంపతుల నుంచి ఫోను : "మా కాబోయే కోడల్ని ప్రేమిస్తున్నాను, చేసుకోకపోతే విషం తాగి చచ్చిపోతానంటూ ఆమె కొలీగ్ ఒకడు తన పేరెంట్సుతో సహా వచ్చి గోల చేస్తున్నాడట. ఒకరోజంతా ఆలోచించి చెబుతానని మా కాబోయే కోడలు అతనితో చెప్పిందట. ఆమె ప్రవర్తన ఎందుకో మాకు అనుమానస్పదంగా ఉంది. ఏం చెయ్యమంటారు ?" అని ! "చేసేదేముంది ? ఆమెకి అతని మీద ఏదో ఒక అభిప్రాయం లేకపోతే అతనికలా టైమివ్వదు. ఆమె ప్రవర్తన మంచిది కాదు. తెగతెంపులు చేసుకుంటున్నట్లు ఆమె తల్లితండ్రులకి తెలియజెయ్యండి" అన్నాము.

సాయంకాలానికే మళ్ళీ ఫోను. "మా కాబోయే కోడలు సూట్ కేసు సర్దుకొని అమ్మానాన్నా చూస్తూండగానే ఆ కొలీగ్ తో లేచిపోయిందట" అని అప్ డేటు. ఏం చేద్దాం ? ఇలా ఉన్నారు సిటీలో అమ్మాయిలు, చదవేస్తే ఉన్నమతి కాస్తా పోయినట్లు ! "పోన్లెండి, మీవాడు నక్కని తొక్కాడనుకోండి. అలాంటి అమ్మాయిని చేసుకొని ఆ తరువాత ఆమె అంతకుముందే పెద్ద హీరోయిన్ అని తెలిసినప్పుడు పడే బాధ కన్నా ఆదినిష్ఠూరంగా అంతటితో పోయిందని సంతోషించండి."అని ఓదార్చాము. వరుడు మాత్రం చాలా దుఃఖంలో ఉన్నాడు. ఆ పిల్ల అందగత్తె కావడంతో అతను పీకలలోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నాడు. అతన్ని ఓదార్చడం సాధ్యం కాలేదు. కానీ ఒక మాట చెప్పాము. "సాక్షాత్తు భగవంతుడైన రాములవారిమీదా, సీతమ్మవారి మీదా నువ్వలా కామెంట్ చెయ్యడం తప్పు. ఆ ఆదిదంపతుల శాపాలు తగుల్తాయి. ఈ అమ్మాయే కాదు. ఏ అమ్మాయీ నీ మొహం చూడని పరిస్థితి వస్తుంది." అని !

ఇంకాస్త తరువాత రాస్తాను.

--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com